. . . మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి, బతుకమ్మ :
ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ఐక్యతతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిజం పట్ల అవగాహన పెంపొందించుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అర్హులైన ప్రతి రిపోర్టర్కు అక్రిడిటేషన్ కార్డు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు.

కామారెడ్డి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు జర్నలిస్టుల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని సమస్యలను ముందుగానే తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు కట్కూరి మల్లేశం మాట్లాడుతూ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని పత్రికల జర్నలిస్టులను సమానంగా గుర్తించాలని అన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు, వారి పిల్లల విద్యలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ప్రతి జిల్లాలో శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెడ్డు సాయిలు, రాష్ట్ర సలహాదారు అరెల్లి మల్లేష్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బాబు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి, రాజేష్, బిక్కనూర్ సాయిలు, జర్నలిస్టులు రాజు, ఆశయ్యతో పాటు వివిధ మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులు పాల్గొన్నారు.

