- జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ కారాగార శాఖ ప్రధాన అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా నిజామాబాద్ జిల్లా జైలును సందర్శించారు. తెలంగాణ కారాగార శాఖ చేపట్టిన పునరావాస కార్యక్రమాల భాగంగా నిజామాబాద్ సెంట్రల్ జైలులో అపికల్చర్ (తేనెటీగల పెంపక కేంద్రం), “నివృత్తి” డీ-అడిక్షన్ సెంటర్ ను తెలంగాణ కారాగార శాఖ ప్రధాన అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలకు తేనెటీగల పెంపకం పైన శిక్షణ ఇవ్వడంతో పాటు, స్వీయ ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. తేనెటీగల పెంపకం సహజసిద్ధమైన, ప్రశాంతతనిచ్చే కార్యక్రమమని, ఇది సహనం, జట్టు పని, బాధ్యతను నేర్పిస్తుందన్నారు.

ఖైదీలు బయటకు వచ్చిన తరువాత కూడా ఈ వృత్తిని కొనసాగించవచ్చునని, ప్రభుత్వం నుండి సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి” అని తెలిపారు. ప్రభుత్వం డ్రగ్ వ్యసనాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, మన కారాగార శాఖ ఈ లక్ష్యానికి తోడ్పడుతోందన్నారు. ‘నివృత్తి’ అనే పేరు మనం ఎన్జీఓలతో సంప్రదించి పెట్టామని దీని అర్థం వ్యసనాల నుండి విముక్తి, శాంతి, కొత్త జీవితం” అని వివరించారు. అలాగే, “ఈ ప్రాజెక్టు నశా ముక్త్ భారత్ నిధుల ద్వారా అమలవుతోందన్నారు. సిబ్బంది ఎంపికను చాలా జాగ్రత్తగా చేసామని, వారి నైపుణ్యం, కరుణ, క్రమశిక్షణను దృష్టిలో ఉంచాము. ఎన్జీఓలు అందిస్తున్న సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాము” అన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు కమిషనర్ సాయి చైతన్య, ఐజి ఆఫ్ ప్రిజన్స్ ఎన్. మురళి బాబు, డిఐజి ఆఫ్ ప్రిజన్స్ కల్పన, ఎస్.ఎం. ఖలీద్ అక్తర్, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎ.డి.ఐ కె. ఆనందరావు, టెరిటరీ మేనేజర్ (రిటైల్) శ్రవణ్ కుమార్, బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ వెంకట కార్తిక్ తదితరులున్నారు.

