బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, విష్ణుపూరి–బాబ్లి ప్రాజెక్టుల గేట్ల నుండి వరద నీరు వదిలేయడంతో గోదావరి ప్రవాహం ఉధృతమైంది. గోదావరి, హరిద్ర, మంజీరా సంగమించే ఈ పవిత్రక్షేత్రం వద్ద నిండుకుండల గోదారమ్మ గర్జనతో ఉప్పొంగిపోతోంది.
- శివాలయం నీట మునిగింది..
సంగమం ఒడ్డున శతాబ్దాలనాటి పురాతన శివాలయం వరద ముంపుకు గురైంది. నది ఒడ్డున పెనువేగంతో తాకిన అలలు ఆలయాన్ని ముంచెత్తాయి. ఈ దృశ్యం చూసిన భక్తుల హృదయాలను కదిలిస్తోంది.
- వంతెన దాకా ప్రవాహం..
పరవళ్లు తొక్కుతున్న నీరు వంతెన దాకా చేరుకోవడంతో అక్కడి దృశ్యం ఆహ్లాదకరంగానూ, భయానకంగానూ కనిపిస్తోంది. సంగమం వద్ద నిలబడితే గంగమ్మ ఉగ్రరూపం సాక్షాత్కారం అవుతున్నట్లుంటుంది.
- పర్యాటకుల సందడి..
ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కెమెరాల్లో గోదావరి ఆవేశాన్ని బంధించేందుకు బ్రిడ్జి ప్రాంతం సందడిగా మారింది. వర్షపు చినుకులు, గాలివానల మధ్య గోదావరి అలల గర్జన చూడటానికి కందకుర్తి పుణ్యక్షేత్రం యాత్రికులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది.
- అధికారులు అప్రమత్తం..
వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

