. . . మేరు కులస్తుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా
. . . కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్ రాజం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గత 20 సంవత్సరాల నుండి మేరు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వాలకు ప్రధాన డిమాండ్ గా విన్నవించుకున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మేరు కులానికి కార్పొరేషన్ ప్రకటించడంతో మేరు కులస్తుల కల నెరవేరిందని చైర్మన్ సంఘ వెంకట్ రాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మినారాయణలు తెలిపారు. నిజామాబాద్ మేరు భవనంలో నూతనంగా నియమింపబడిన చైర్మన్, వైస్ చైర్మన్ లను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోమ హన్మంత్ రావు సభా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరాజం మాట్లాడుతూ మేరు కులానికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తూ, 50 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు యావత్ తెలంగాణ రాష్ట్ర మేరు కులస్థుల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలోని, అన్ని పట్టణ, మండల కార్యవర్గాలు, నిర్మల్ జిల్లా, కామారెడ్డి జిల్లా, జగిత్యాల జిల్లా కార్యవర్గాలు, పక్క రాష్ట్రమైన మహా రాష్ట్రలోని, ముంబై, పూణే, నాందేడ్ అధ్యక్ష కార్యవర్గాలు హాజరై ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా మేరు కులస్తుల సమస్యలపై డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఉచితంగా బీసీ మహిళలకు నియోజకవర్గం నకు 1000 కుట్టు మిషన్ ల పంపిణీలో కనీసం 50 శాతం మేరు కుల మహిళలకు అందే విధంగా చూడాలి. రజక, నాయి బ్రాహ్మణ దుకాణాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత కరెంటు వసతిని మేరు కుల వృత్తి దుకాణాలకు కూడా వర్తింప చేయాలన్నారు. ప్రభుత్వం బట్టలు కుట్టించే ప్రతి విభాగంలో యూనిఫాంలలో కాంట్రాక్టు లను మేరు కులస్థులకు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై చైర్మన్ స్పందించి మూడు డిమాండ్లు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమ హన్మంత్ రావు తో పాటు నగర మేరు సంఘం అధ్యక్షులు వెన్ను దేవానంద్, జిల్లా ఉపాధ్యక్షులు కొట్టుర్ చంద్రకాంత్, జిల్లా కోశాధికారి కొక్కు రాజేశ్వర్, జిల్లా సంయుక్త కార్యదర్శి గట్ల నరేందర్, తాళ్ల నర్సింలు, నగర ఉపాధ్యక్షులు పుట్టకోట పాండు, కొట్టుర్ సురేష్, నగర సంయుక్త కార్యదర్శి రాచర్ల అరుణ్ చంద్, తాళ్ల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

