…మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల.. బాజీరెడ్డి గోవర్థన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
కెసిఆర్ పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా గౌరవించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతు సంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల.. బాజీరెడ్డి గోవర్థన్ లు విమర్శించారు.. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్థన్ లు విలేఖరులతో మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.రైతులకు పెట్టుబడి భారం తగ్గించడానికి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు సబ్సిడీలపై అందించి రైతు శ్రమను తగ్గించారని పేర్కొన్నారు.అలాగే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను వ్యవసాయ రంగానికి అందించడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితి కల్పించారని అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 50 శాతానికి పైగా వాటా సాధించి దేశానికి అన్నపూర్ణగా నిలిచిందంటే అది కేసీఆర్ అమలు చేసిన రైతు అనుకూల విధానాల ఫలితమేనని పేర్కొన్నారు. రైతు కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలిచింది అన్నారు. ఇక నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్థన్ లు తీవ్రంగా విమర్శించారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించి యాప్లు, ఆన్లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగం పై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు కోల్పోతుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.