. . . ఆటోను త్రాడుతో లాగి సిపిఐ నిరసన
కోటగిరి, బతుకమ్మ :
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ మండల కార్యదర్శి, ఏ.విటల్ గౌడ్ అన్నారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని బస్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ మండల కార్యదర్శి, ఏ.విటల్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని చెప్పిన ప్రధాని మోడీ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 3 రూపాయలు పెంచడం దుర్మార్గమని అన్నారు. గత ప్రభుత్వంలో రూ.300 ఉన్న గ్యాస్ ధర బిజెపి హయంలో వెయ్యి రూపాయలకు పైన చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజులు గ్యాస్ దొరికే పరిస్థితి లేదన్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిరు వ్యాపారులు హోటల్లు మూసివేసుకునే పరిస్తితి నెలకొన్నదన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బిజెపి హయంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై జీఎస్టీ తెచ్చిందని పెట్రోల్, డీజిల్ పై జిఎస్టిని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, కే.రాజు, రాములు, హనుమాన్లు, అన్సార్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
