- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య
కామారెడ్డి, బతుకమ్మ : నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్రహ్మాజీ వాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా దళితులపై అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చిన అవి అమలుకు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణానికి కేక వేసిన దూరంలో ఉన్న బ్రహ్మాజీ వాడి గ్రామంలో దళితులపై విచక్షణ రహితంగా ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. గ్రామంలో మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులుతో ఫోన్లో మాట్లాడారు. బ్రహ్మాజీ వాడిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి పైరవీలకు చోటు ఇవ్వొద్దన్నారు. బాధితులకు సరైన న్యాయం జరగకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోల గంగారం, గౌరవ అధ్యక్షులు మల్లన్న, ప్రధాన కార్యదర్శి గైని రాజు, చిట్యాల లింగం అంబేద్కర్ సంఘం నాయకులు, దళిత సంఘం నాయకులు, పాల్గొన్నారు.