హైదరబాద్, బతుకమ్మ :
గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు అధికారిక పర్యటనకు బయలుదేరింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరిన బృందం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం పై అధ్యయనం చేయనుంది. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి, కమిటీ చైర్మన్డా .బిఎం వినోద్ కుమార్ లు ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20, 21వ తేదీలల్లో పర్యటించి.. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు లతో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, వాలంటీర్ కర్రి పద్మారాణి, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

