హైదరాబాద్, బతుకమ్మ :
బీడీ పరిశ్రమలో వేతనాల పెంపు కోసం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. బీడీ పరిశ్రమలోని వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతన ఒప్పందంపై హైదరాబాద్ లో స్వాగత్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బీడీ పరిశ్రమ యాజమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలలో బీడీ పరిశ్రమలో పని చేస్తున్న బీడీ ప్యాకింగ్ కార్మికులకు నెలకు రూ.4500 (చాటన్, బట్టి వాలా), ఇతర నెలసరి జీతాల ఉద్యోగులకు నెలకు రూ.2200, బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు రూ.6 పెంపుదలకు బీడీ యాజమాన్య సంఘాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మే 1 నుండి ఏప్రిల్ 30, 2028 వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ చర్చలలో ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, రష్మికాంత్ పటేల్, రమన్ భాయ్, ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ల రాజన్న (నిర్మల్), శ్రీ శైలం (సిద్దిపేట్) రాష్ట్ర సహాయ కార్యదర్శి మామిడ్యాల వెంకటి (నిజామాబాద్), జిందం ప్రసాద్ (కరీంనగర్), రాష్ట్ర కోశాధికారి డి.రాజేశ్వర్ (నిజామాబాద్) ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

