27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • ధాన్యం నిల్వల కోసం అదనపు గోడౌన్లు గుర్తించాలి
  • కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
  • రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం

 

నిజామాబాద్, బతుకమ్మ : రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు, బాల్కొండ మండల కేంద్రంలో, మోపాల్ మండలం వెంచిర్యాలలో పీఏసీఎస్, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం అమ్మకం విషయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకువచ్చారు, ఎన్ని రోజులకు తూకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను

Steps taken to avoid delays in grain import at mills

పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుని నిలువ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం జరుగకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులకు గురికాకూడదని, నిర్ణీత గడువు లోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వెంటదివెంట ధాన్యం సేకరణ జరుపుతూ, మిల్లుల వద్ద అన్ లోడింగ్ లో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్ప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఐకేపీ డీపీఎం సాయిలు, స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.

Steps taken to avoid delays in grain import at mills

More articles

Latest article