నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ సి. వెంకటరమణ సోమవారం పర్యవేక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూలాంగ్ బ్రిడ్జి సమీపంలోని మురికివాడలో గృహ సందర్శన నిర్వహించారు. బూత్ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారి ఇళ్ల వద్దే పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు లబ్ధిదారులతో మాట్లాడి పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన, సేవల అందుబాటు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం వేస్తున్న ఫింగర్ మార్కింగ్ను పరిశీలించి కార్యక్రమం సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతి చిన్నారికి సోమవారం, మంగళవారం తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అనిల్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డీహెచ్ఈలు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, హెచ్ఈఓ వెంకట్ రవి, వినోద్, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ వాలంటీర్లు పాల్గొన్నారు.
