నందిపేట్, బతుకమ్మ :
గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిన పిచ్చి మొక్కల నిర్మూలన కోసం నందిపేట్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పిచికారీ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని రోడ్ల వెంబడి, డ్రైనేజీల పరిసర ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలను తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది కలుపు నివారణ మందు పిచికారీ చేశారు. 6, 7, 8 వార్డుల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పిచ్చి మొక్కల వల్ల దోమల బెడద ఎక్కువై గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాలక వర్గ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు సర్పంచ్ సిలిందర్ ఎర్రం లింగం వెల్లడించారు. గ్రామస్తులు సైతం ఈ కార్యక్రమానికి సహకరించి, తమ ఇళ్ల పరిసరాల్లో కూడా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఆటోలో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు చింత రవి, షేక్ పాషా, చింత శ్రీనివాస్, కస్తూరి గంగాధర్, నాయకులు ఇమ్రాన్ ఖాన్, సిబ్బంది పాల్గొని పనులను స్వయంగా పర్యవేక్షించారు.
