భిక్కనూరు, బతుకమ్మ:
భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్ద రామేశ్వర స్వామి స్వయంభు లింగ మహాక్షేత్రంలో చైత్రమాసం కృష్ణ ఏకాదశి సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు, పుట్టువెంట్రుకలు వంటి కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి చంద్రమౌళి గుప్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానం నిర్వహించిన చంద్రమౌళి గుప్త కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆలయ ఆనువంశ అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు తాటిపాముల లింబాద్రి, ఉపాధ్యక్షులు అందెదయాకర్ రెడ్డి, సభ్యులు నీలా అంజయ్య, చీకోటి ప్రభాకర్ గుప్త, నాగర్తి రమేశ్ రెడ్డి, బాపురెడ్డి, నారాయణ, బాగయ్య తదితరులు ఉన్నారు.
