జుక్కల్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సేవా, పర్యావరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్పూర్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే, వారి సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కూడా పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం విశేషంగా నిలిచిందని పలువురు నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

