. . . స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
. . . అన్ని పిఎస్ ల పరిధిలో పాత నేరస్తుల వివరాల సేకరణ
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో పాత నేరస్తుల కోసం పోలీసు లు వేట మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలో సస్పెక్ట్ షీట్ కలిగిన వారి కోసం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్, దేవునిపల్లి పిఎస్ ల పరిధిలో పాత నేరస్తుల ఇండ్లకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్తుల కదలికలను కనుక్కునేందుకు ఈ సోదాలు చేపట్టారు. ఇటివల కాలంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల పెరగడం, పాత నేరస్తులు జైలు శిక్ష తర్వాత మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రధానంగా కొందరు పోలీసు స్టేషన్ లో అనుమానిత జాబితాలో ఉండి వివరాలు గల్లంతు కావడం, కొందరు నాన్ బెయిలబుల్ వారంట్ లు ఉండటంతో పాటు పలువురు పదే పదే నేరాలను వృత్తిని ఎంచుకున్న నేపథ్యంలో వారి కట్టడికోసం తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో శనివారం ఉదయం నుంచి ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో మూడు సబ్ డివిజన్ ల అధికారులు రంగంలోకి దిగి ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం, దొంగతనాలు పెరగడం, అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా అనుమానితుల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
