. . . సర్పంచ్ బోయిని హరిన్ కుమార్
కామారెడ్డి, బతుకమ్మ :
మహమ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. హసన్పల్లి గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హసన్పల్లి గ్రామం మీదుగా హెడ్స్లూయిస్ వరకు రాకపోకలు సాగించేదని, దాదాపు 60 సంవత్సరాలుగా ఈ సౌకర్యం కొనసాగిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రస్తుతం బస్సు గ్రామం వరకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు ఎల్లారెడ్డి పాఠశాలకు వెళ్లేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని వినతిపత్రంలో వివరించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును తిరిగి హసన్పల్లి గ్రామం వరకు నడపాలని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకటరాములు, వీఎస్ఎస్ చైర్మన్ మంగలి రాములు, నాయకులు హరిజన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
