నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హుడు కాడని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. నేర చరిత్ర కలిగిన గుండాలు, ఫ్యాక్షన్ ముఠాల మాటలు ఒక ముఖ్యమంత్రి నోటినుండి రావడమే ఒక విషాదమని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, భారాస నాయకులైన కేటీఆర్, హరీష్ రావు లను “నరికి వాళ్ళ నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి” అనే మాటలు రావలసినవి కావని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్రూరమైన భాషను వాడిన సందర్భం లేదని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని ముఖ్యమంత్రి కక్షసాధింపు రాజకీయాలనే నమ్ముకుని పాలన చేస్తున్నాడని మధుసుధన్ రావు ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజంలో హింసను ప్రేరేపించే విదంగా మాట్లాడటానికి తావు లేదని, ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
