. . . నందిపేట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
నందిపేట, బతుకమ్మ :
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ సూచించారు. నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వ, ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ పనితీరు, వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిజిస్టర్లు, రోగుల నమోదు వివరాలు, ఔషధాల నిల్వ, టీకాల భద్రత, కోల్డ్ చైన్ నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు నవీకరించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం నందిపేటలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే ను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరు, నమోదవుతున్న వివరాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించి, నిబంధనల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా సర్వేను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని, అవసరమైన వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.

