ఎల్లారెడ్డి- బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులు
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ… గిరిజన పాఠశాలలో అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి బియ్యం నిల్వలను పరిశీలించారు. అలాగే విద్యార్ధులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.

