వెబ్ న్యూస్, బతుకమ్మ : సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన ఫిర్యాదులో మహేష్ బాబును మూడవ ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్లో ఒక ప్లాట్ కోసం సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు రూ.34,80,000 చెల్లించామని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంకు బాధితులు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తరువాత అసలు లేఅవుట్ లేదని తెలిసి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే, కేవలం రూ.15 లక్షలు చెల్లించారని, తమకు న్యాయం చేయాలని కన్స్యూమర్ ఫోరంలో బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ బాబును, రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులను విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. జూలై 8 లోపు ఫోరం ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
