నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిజిహెచ్ లో జరుగుతున్న తప్పిదాలపై విచారణ చేపట్టి, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా జీజీహెచ్ పై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య డిమాండ్ చేసారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహేచ్) కి సంబంధించిన మాతశిశు సంరక్ష కేంద్రం, క్రిటికల్ కేర్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఎమ్ ఎల్ సి (మెడికల్ లీగల్ సర్టిఫికెట్) రెండు బుక్కులను ప్రింట్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జీజీహెచ్ ఆరోగ్యశ్రీలో నష్టం వాటిల్లిందని, ఆ అంశాల పైన పలు పత్రికలలో కథనాలు రావడం జరిగిందన్నారు. జులై నెలలో డైట్ నిర్వహణ కోసం టెండర్లు వేసిన వాటిని ఇప్పటివరకు ఫైనల్ చేయకుండా దాచి పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అసంపూర్తి సమాధానాలు ఇస్తున్న జిజిహెచ్ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని కోరారు.
