. నేటి నుంచి పోలీస్ స్టేషన్ ల బయట డిస్ప్లే
. అవినీతిని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
. ఇన్ చార్జి సీపీ సింధుశర్మ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్ లలో సత్వర న్యాయం జరగకపోతే ఫిర్యాదు చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల బయట బోర్డులపై ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ చార్జి సీపీ సింధుశర్మ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న నంబర్ కు వాట్సాప్ లేదా డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీని జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ఇన్ చార్జి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. అవినీతిని నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రంగంలో అంతర్గత నిఘా అవసరమని సింధుశర్మ అన్నారు. పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
