. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం
నవీపేట్, బతుకమ్మ: పట్టాలపై బైక్ నడుపుతూ రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నవీపేట మండలం దర్యాపూర్ రైల్వే గేటు వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై బైక్ నడుపుతూ నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లడాన్ని గమనించిన గేట్ మెన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు రైలును నిలిపివేయించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు జగదీశ్ అని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలిపాడు.
వీడియో చిత్రీకరణకు ప్లాన్?
రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న జగదీశ్ అక్కడే ఉన్న మరో వ్యక్తితో వీడియో తీయించాడా? లేక గేటు దగ్గర నిల్చుని ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించాడా? అనేది తెలియాల్సి ఉంది. వీడియో తీసిన వ్యక్తి జగదీశ్ ను అడ్డుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
