పోతంగల్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర సరిహద్దులో గల పొతంగల్ చెక్ పోస్ట్ ను గురువారం పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్ట్ లను కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డు లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా పశువులను తరలించడం జరగకూడదని, ప్రతీ వాహనానికి గల కాగితాలు తనిఖీ చేయాలన్నారు. అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , కోటగిరి పిఎస్ ఎస్ఐ సునీల్, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.

