రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి కవిత నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ పూలే విగ్రహం ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కుల గణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలని కోరారు.
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు మద్దతు తెలిపిన సీపీఎం
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతును ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈసందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
