. . . ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్
మోపాల్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎరువుల ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొగపాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెంపులతో సామాన్య ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతోందని, చమురు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించడంతో పాటు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను మినహాయించాలని కోరారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధ హోదా కల్పించి, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు చేసిన సీ2+50 శాతం ఫార్ములా ప్రకారం రైతుల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండ్లు, కూరగాయలతో సహా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని శిక్షార్హ నేరంగా పరిగణించాలని సూచించారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ)కు చట్టబద్ధ హోదా కల్పించాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.20 వేల సామాజిక భద్రతా పెన్షన్ అందించాలని, రైతు, వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. మహిళలు, ఆదివాసీలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యలను అరికట్టి, రాజకీయ ప్రభావాలకు అతీతంగా దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ, సీబీఐ వంటి సంస్థల దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ మూల్యాంకన కుంభకోణాలపై సంబంధిత మంత్రులు బాధ్యత వహించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి, పెరిగిన వేతనాలతో అమలు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులపై వేధింపులు నిలిపివేసి వారికి న్యాయం చేయాలని, ఇరాన్, వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలను, క్యూబాపై బెదిరింపులను ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాచూరి దత్తు, తలగాటి బస్వా భాను, మహిళా నాయకురాలు గుర్రం రమాదేవి, దండు స్వప్న, బొడ్డు సునీత, గందమాల స్వరూప, గుండెల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.
