- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్థులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ కొత్త విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చిట్యాల గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల, గ్రామ యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

