బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన పోట్కూరి లింగారెడ్డి గత ఏడాది కాలంగా మలేషియాలో చిక్కుకుపోయాడు. జీవనోపాధి కోసం అతను మలేషియాకు వెళ్లాడు, కానీ గల్ఫ్ ఏజెంట్లు, మధ్యవర్తుల వల్ల మోసపోయాడు. చట్టవిరుద్ధమైన ఇమిగ్రాంట్ కావడంతో అతను మలేషియాలో చాలా బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇంతలో దురదృష్టవశాత్తు మలేషియాలో బస్సు ప్రమాదంలో గాయపడి మంచం పట్టాడు. అనారోగ్యం, ఆర్థిక సమస్యల కారణంగా అతను మలేషియా నుండి ఇంటికి చేరుకోలేకపోయాడు. లింగారెడ్డి క్షేమంగా తిరిగిరావాలని వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్తించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మలేషియాలోని ఐఐహెచ్సీకి పంపారు. దీనితో అతను ఇండియా తిరిగిరావడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లింగారెడ్డి ఇంటికి తిరిగిరావడానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విమాన టిక్కెట్ అందించారు. ప్రస్తుతం ఆయన స్వగ్రామం ఏర్గట్ల మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు అన్ని విధాలుగా సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.