నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ, ఖాళీల పెంపు, వయోపరిమితి సడలింపు వంటి డిమాండ్లతో సోమవారం నిజామాబాద్లో నిరుద్యోగ యువత శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీ నుంచి కలెక్టరేట్ వరకు నడక మార్గంలో ర్యాలీ చేపట్టి, అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 5,000 పోలీస్ ఖాళీలను వెంటనే 20,000కు పెంచి భర్తీ చేయాలని వారు కోరారు.

అదే విధంగా కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా సిద్ధమవుతున్న నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, తమ డిమాండ్లను ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ నియామకాల సంఖ్యను పెంచడంతో పాటు వయోపరిమితిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

