- చట్ట బద్దత కోసం రాష్ట్ర పతిని కలుస్తాం
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ : బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ స్తంభింప చేస్తామని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీ స్థాయిలో మూడు రోజుల పోరాటం చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డి పట్టణంతో పాటు దోమకొండ మండలంలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీసీ బిల్లు చట్ట బద్దత కోసం రాష్ట్ర పతిని కలుస్తామని తెలిపారు. బీజేపీ నేతలు కోడి గుడ్డుపై ఈకలు పీకడం మానుకోవాలన్నారు. బీసీ బిల్లు పై అభ్యంతరాలు ఉంటే చర్చిద్దాం, కానీ కొట్లాటలు సృష్టించవద్దని అన్నారు. గ్రామ పంచాయతీ లకు రెండేళ్లుగా ఎన్నికలు లేక 6వేల కోట్లు నష్టపోయామని తెలిపారు. ప్రజల ఇబ్బందులు చూస్తే పంచాయతీ రాజ్ మంత్రిగా బాదేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల ను బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తుందని విమర్శించారు. బీసీ బిల్లు పై అభ్యంతరాలు ఉంటే పార్లమెంట్ లో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు.

దోమకొండ కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు మంత్రి సీతక్క రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అన్ని మహిళల పేరుతో ఇస్తున్నామన్నారు. ఇంట్లో ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనే ఉచిత బస్సు పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం పై ప్రతిపక్షాలు గాలి మాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మహిళలకు మేలు జరుగుతుంటే బీజేపీ, బి. ఆర్.ఎస్ నేతలు ఓర్చుకోలేపోతున్నాయని విమర్శించారు. గాలి మాటలు మాట్లాడే వాళ్ళు.. ఉచిత బస్సు ఎక్కొద్దన్నారు.

మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు 26వేల కోట్లు రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. 60 ఏళ్లు దాటినా మహిళా సంఘాల్లో సభ్యత్వం ఇస్తున్నామని తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన బాలికలు మహిళా సంఘాల్లో సభ్యత్వం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీజేపీ పేరుకు మాత్రమే బీసీ జపం చేస్తుందన్నారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడి తొలగించి బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తో బీజేపీ కి భయం పట్టుకుందని తెలిపారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల పై కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు…? మోదీ అంటే జూటా.. జూటా కా సర్కార్.. అని విమర్శించారు.

