- హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం
- జంగంపల్లి కృష్ణ మందిర్ ఆలయ సమీపంలో ఘటన
బతుకమ్మ భిక్కనూరు: ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఒకరు బైక్ పై వెళ్తుండగా, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు ఒకరు దుర్మరణం పాలైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే … సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామానికి చెందిన కోట్ల శ్రీనివాస్ (43) వ్యవసాయంతో పాటు, బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బీబీపేట మండల కేంద్రంలో బంధువులకు సంబంధించిన ఫంక్షన్ ఉండడంతో, ఆ ఫంక్షన్ ను అటెండ్ చేసేందుకు తన బైక్ పై బయలుదేరాడు. ఆర్టిఏ చెక్ పోస్టు దాటి కృష్ణ మందిర్ ఆలయ సమీపంలోకి రాగానే, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకు వెనకాల టైలర్ కిందికి చొచ్చుకుపోగా, బైక్ నడుపుతున్న శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ మృతి చెందాడని తెలిసి ఇదే దారిలో వేరే ఊళ్లో ఫంక్షన్ కు అటెండ్ అయిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేసుకొని, డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
