. . . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.అపర్ణ
డిచ్ పల్లి, బతుకమ్మ :
విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే వేదికగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిలుస్తాయని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) యూనిట్-II ఆధ్వర్యంలో డిచ్పల్లి గ్రామంలో ఏప్రిల్ 24 నుండి 30 వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిబిరం శుక్రవారం ప్రారంభించారు. శిబిరంలో భాగంగా నిర్వహించిన మొక్కల నాటకం (ప్లాంటేషన్ డ్రైవ్) ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వాలంటీర్లు విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను చాటారు.

ఈ సందర్భంగా వారు వివిధ ఔషధ మొక్కల గుణాలు, వాటి వైద్య ప్రయోజనాల గురించి గ్రామస్థులకు వివరించారు. స్థానికంగా లభించే మొక్కలను సంప్రదాయ వైద్యంలో ఎలా ఉపయోగించవచ్చో వివరించి, ఆరోగ్య పరిరక్షణలో సహజ విధానాల ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సమీప ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి, చెత్త తగ్గింపు, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై గ్రామస్థుల్లో అవగాహన కల్పించారు.

డా. అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ మాట్లాడుతూ శిబిరాలు క్రమశిక్షణ నిబద్ధత, గ్రామీణ స్థాయిలో పనిచేసే ప్రాముఖ్యతను వివరించారు. యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ & ఎన్ఎస్ఎస్ చైర్మన్ ప్రొఫెసర్ జి.రాంబాబు పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు, ఐక్యత, సామాజిక అవగాహన పెరుగుతాయని సూచించారు. విద్యార్థులు పర్యావరణ రక్షణలో ముందుండి పనిచేసి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి గ్రామ సర్పంచ్ యాదగిరి లోక్కిడి, గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషియర్ ఆసాది రవీందర్, వార్డు సభ్యులు బల్లా బాలకృష్ణ, మేకల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
