29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సెల్ ఫోన్ పోతే ఆందోళన అవసరం లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పొందే అవకాశం

 

. . . ఈ ఏడాది ఇప్పటివరకు రూ.79 లక్షల విలువైన 499 ఫోన్లు స్వాధీనం

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా, అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటా కూడా ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సీఐ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందన్నారు. గణాంకాలను వెల్లడిస్తూ, గత ఏడాదిలోనే సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 30 రోజుల్లో రూ.19 లక్షల విలువైన 115 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. అలాగే సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4780 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.7.64 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ లను బాధితులకు తిరిగి అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్ కార్డును బ్లాక్ చేసి www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తుతెలియని లింకులు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్ లను పొందేందుకు బాధితులు తమ వద్ద ఉన్న ధృవపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజు (ఫోన్: 8712686114) ని సంప్రదించి తమ మొబైల్ ఫోన్ లను పొందవచ్చని తెలిపారు.

More articles

Latest article