వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్లో నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏఐసిఎం) 117వ కార్యవర్గ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణాల అభివృద్ధి, ఆధునిక పట్టణ పాలన, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛత, సుస్థిర నగరాభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో దేశంలోని పలు రాష్ట్రాల మేయర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణాభివృద్ధి నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి రమేష్ నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై తన సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఇతర నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి నమూనాలు, వినూత్న పట్టణ పాలనా విధానాలను పరిశీలించి వాటి ద్వారా నగర అభివృద్ధికి ఉపయోగపడే అంశాలను అధ్యయనం చేశారు. దేశంలోని వివిధ నగరాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి, ఉత్తమ పద్ధతుల అమలుకు ఈ సమావేశం వేదికగా నిలిచిందని మేయర్ ఉమారాణి రమేష్ తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇటువంటి సమావేశాల్లో పొందిన అనుభవాలు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.
