వెబ్ డెస్క్, బతుకమ్మ :
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో గల లక్ష్మణ తీర్థం ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన నృత్యాంజలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ 2026 సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన చిన్నారి పి.కీర్తన (8 సంవత్సరాలు) తన నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ తోట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్కు చెందిన పాసికంటి ప్రసాద్ కుమార్తె పి. కీర్తన కూడా ఒకరు. ఆమె ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులు, నిర్వాహకుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్నారి కీర్తనకు ప్రశంసా పత్రం, మెమెంటో అందజేసి సత్కరించారు. తమ కుమార్తె జాతీయ స్థాయి సాంస్కృతిక వేదికపై ప్రతిభ కనబరచడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గురువు తోట సతీష్ కుమార్ మార్గదర్శకత్వంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను పలువురు సాంస్కృతిక ప్రముఖులు అభినందించారు.

