. . . ఉషోదయ కాలేజీ విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రశంసలు
బోధన్, బతుకమ్మ :
విద్యార్థులు సాధించిన ఫలితాలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బోధన్ మండల కేంద్రంలోని ఉషోదయ ఇంటర్మీడియట్ మహిళా కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రతిభ చాటడంతో వారికి బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను బోధన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిజామాబాద్ సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేయడమే విద్యార్థుల అసలైన లక్ష్యమని, చిన్నప్పటి నుంచే కష్టపడే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. కష్టపడి చదివితేనే మంచి ఉద్యోగాలు సాధించగలరని చెప్పారు. అనంతరం రమాకాంత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని, విద్యార్థులతో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ ప్రతిజ్ఞ చేయించి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. అలాగే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, డ్రగ్స్ నియంత్రణకు సహకరించాలని, నేరాల నివారణలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కాలేజీ చైర్మన్ ప్రకాష్, డైరెక్టర్ దుష్వంత్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్వో వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

