- నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ
- మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల
హైదరాబాద్, బతుకమ్మ : నంబాల కేశవరావును పోలీసులు సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ‘‘మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్. 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. కేశవరావు టీమ్లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి.. 20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భంధించాయి. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు.

ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు. సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించాం. మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతోటే ఉన్నారు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం.. మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు’’ అని లేఖలో పేర్కొంది.
