హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం
వెబ్ న్యూస్, బతుకమ్మ: హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల ప్రీ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యారు. ఈ సందర్భంగా నమస్తే ఇండియా అంటూ పిజ్కోవా ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానన్నారు. ఇండియాలో మంచి స్పిరిట్ ఉందన్నారు. వివిధ మతాల వారు కలిసి జీవిస్తున్నారన్నారు. ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగా నచ్చిందన్నారు. అనంతరం టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ..మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సిద్ధమైందన్నారు. ఈ ఈవెంట్ రాకతో హైదరాబాద్ కే అందం వచ్చిందన్నారు. తెలంగాణను త్రిలింగ దేశం అంటారని, తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టూరిజం మంత్రి జూపల్లి, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లీ, తదితరులు పాల్గొన్నారు.
