- నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన లైంగిక వాంఛ తీర్చాలని కన్న కూతురిని వేధించడంతో ఆగ్రహించిన కూతురు తండ్రిని హత్య చేసిందని నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట్ మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఆయన వివరించారు. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య తన చిన్న కూతురు వర్షిణీ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అందుకు కూతురు నిరాకరించడంతో బలవంతం చేశాడు. సహనం కోల్పోయిన కూతురు రోకలి బండతో తలపై మోది చంపింది. గతంలోనూ మ్రుతుడు నర్సయ్య తన పెద్ద కూతురు గంగామణి పైన పలుమార్లు అత్యాచారానికి యత్నించాడు. పెద్ద కూతురు భర్త చనిపోవడంతో తండ్రి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో ఆమే తన తల్లితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. తండ్రి లైంగిక వేధింపులు తట్టుకోలేక పెద్ద కూతురు మరో వివాహం చేసుకుని వెళ్లిపోయింది. చిన్న కూతురు సైతం వివాహం చేసుకుని కొత్త పేటలో ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్నకూతురు పట్ల తప్ప తాగిన మైకంలో నర్సయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. సహనం కోల్పోయిన ఆమె రోకలి బండతో మోదడంతో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంతో నవీపేట్ ఎస్ఐ వినయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
