హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు “ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్” పేరుతో బహిరంగంగా దుకాణం పెట్టుకుని కార్డులను పంచుతున్నారని తెలిపారు. “ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వచ్చాయి? జీహెచ్ఎంసీ కమిషనర్లు, ఎన్నికల అధికారులూ ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎలా అర్హుడు అవుతాడు అని ప్రశ్నిస్తూ, “ఓటర్ ఐడి కార్డులు ఎవరి అనుమతితో పంచుతున్నారు? జీహెచ్ఎంసీ కమిషనరా ఇచ్చారు? లేక ఎన్నికల కమిషనా?” అని అన్నారు. “కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వెళ్ళాయో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు. “ఎస్ఐఆర్ చేస్తామంటే గగ్గోలు పెట్టే మేధావులు — ఈ కార్డుల చోరీపై కూడా స్పందించాలి. ఎస్ఐఆర్ చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారు, మరి ఇది ఐడీ కార్డుల చోరీ కాదా?” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
