నిజామాబాద్, బతుకమ్మ : అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున రాత్రి నుంచే అంగన్ వాడీ ఉద్యోగులను, సీఐటీయూ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈసందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించే బదులు పోలీసు నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవటం అవివేకం అవుతుందన్నారు. బుధవారం రాత్రి నుంచి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను, తనను పోలీసులు గృహనిర్బంధం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనేకమంది అంగన్ వాడీ టీచర్లను ఉదయం నాలుగు గంటల నుంచి పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారని. బస్టాండును, మరియు రైల్వే స్టేషన్లకు చేరుకున్న అంగన్ వాడీకార్యకర్తలను ప్రయాణికుల అందరి ముందు మహిళలని కూడా చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని ఇది సరియైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్టయిన అంగన్ వాడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ నాయకులు సవిత, స్వాతి, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

