. అటవీ భూములపై హక్కులు కల్పించాలి
. ఫారెస్ట్ భూములకు ఆనుకుని వ్యవసాయ భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి
. గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు అభ్యంతరం తెలపకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి
. అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
రాజంపేట, బతుకమ్మ: గిరిజనులకు అటవీ భూముల హక్కుల కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో తన గళం వినిపించారు. అటవీ భూములను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి వివాదాల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని చాలా మండలాల ప్రజలు అటవీభూములకు సబంధించి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీసీ రైతులు గత 30 ఏళ్లుగా అటవీ భూములను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. సదరు రైతులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుకావడంతో వారికి గతంలో ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేయలేదని, ఇన్నేళ్లుగా ఏమీ అనని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి వారిని అక్కడ వ్యవసాయం చేయకుండా భూములను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అలాగే రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా, హద్దు గుండు తండాలకు చెందిన చాలా మంది రైతులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు వచ్చినప్పటికీ, కొంతమంది గిరిజన రైతులకు సాంకేతిక కారణాలతో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేయలేదని, దీంతో రైతులను అటవీశాఖ అధికారులు వ్యవసాయం చేయనివ్వడం లేదని తెలిపారు. వ్యవసాయ భూములన్నీ నిరూపయోగంగా మారి ఎందుకు పనికి రాకుండ పోతున్నాయని, నూతన ఇళ్లు నిర్మించుకునే వారికి సైతం అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని పరిగణలోకి తీసుకొని రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో జాయింట్ సర్వే ను నిర్వహించి వివాదాలు లేకుండా భూమి హక్కులను రైతులకు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చిన భూముల్లో నీటి సదుపాయం కోసం రైతులు పనులు చేసుకునేందుకు అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరారు.
