మెండోరా, బతుకమ్మ :
మెండోరా మండలం దూద్గావ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గత 10 రోజులుగా ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ గన్ని సంచులు, లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే జిల్లా సరఫరా అధికారితో (డీఎస్ఓ) ఫోన్లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. దూద్గావ్ వంటి పెద్ద గ్రామానికి కేవలం 6 వేల గన్ని సంచులు మాత్రమే పంపడం సరికాదని, వెంటనే అదనపు బార్దాన్ పంపాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి కేవలం మూడు లారీలు మాత్రమే రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని రైస్ మిల్లుల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోల వరకు ‘తరుగు’ పేరుతో అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని ఆరోపిస్తూ, 41.5 కిలోలకంటే ఎక్కువ తీసుకోవద్దని హెచ్చరించారు. రైతులను దోచుకునే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే నష్టపోయారని, ఇకపై ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు.

