జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ లో విలువ రూ.44 లక్షలతో నిర్మించిన అదనపు గదులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్లాస్ రూమ్స్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకెళ్లాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జుక్కల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలని, ప్రతీ స్కూల్లో సరిపడా ఉపాధ్యాయ సిబ్బంది, లేబోరేటరీస్, క్లాస్ రూమ్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా పని చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని దృఢ సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారని అన్నారు. ప్రతీ ఒక్క విద్యార్ధి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని పట్టుదలతో చదివి గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.

