. . . ముధిరాజ్ సంఘం భవన అభివృద్ధి కోసం 5 లక్షల నిధులు మంజూరు
. . . కమ్యూనిటీ సంఘాలకు రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలను తెలుసుకొని, చేపడుతున్న పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముధిరాజ్ సంఘం భవన అభివృద్ధి కోసం మంజూరైన రూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే సంఘ ప్రతినిధులకు అందజేశారు. అలాగే నాయి బ్రాహ్మణ సంఘం ఆర్య కటికె సంఘం గంగపుత్ర కమ్యూనిటీ సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.3లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 7వ వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే పరిశీలించి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని తెలిపారు. ముఖ్యంగా బస్ స్టాండ్ అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని, ఎల్లారెడ్డి పట్టణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

