నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే స్టేషన్ నందు ఈనెల 5న రాత్రి బాంబు పెట్టినట్లు కీసర మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శ్రీమంత్ గౌడ్ డయల్ 100 కు కాల్ చేశారు. సమాచారాన్ని స్వీకరించిన వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తన యొక్క సిబ్బందితో హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బిడి టీం సహాయంతో పూర్తిగా రైల్వే స్టేషన్ లో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించి పరిశీలించి బాంబు లేనట్లుగా నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు ఫేక్ డయల్ 100 కి కాల్ చేసిన శ్రీమంత్ గౌడ్ అను వ్యక్తిని పట్టుకొని విచారించారు. తన యొక్క పర్సనల్ సమస్యలతో, ప్రజల్లో భయాందోళన గురిచేసి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో ఫోన్ కాల్ చేశానని తెలిపారు. శ్రీమంత్ గౌడ్ ను న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
