. . . మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
. . . బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్ల పరిశీలన
. . . అధికారులకు కీలక ఆదేశాలు జారీ
. . . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనలతో తాగునీటి నివారణకు ప్రణాళిక
కామారెడ్డి, బతుకమ్మ :
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్, కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్, గడ్డమీద మహేష్, అంజద్, లడ్డు, భూపతి, గంగాధర్, వాజిద్, లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్, కె. లలిత, బబ్లు, మాజీద్, జావేద్, యూనుస్, సిద్దిఖ్, గ్యార సాయిలు, మన్సూర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

