- సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి.రామకృష్ణ
సిరికొండ, బతుకమ్మ : ప్రజల కోసమే అంకితమై ప్రాణాలను సహితం అర్పించిన సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని, జీవితాంతం ప్రకజలకోసం కృషి చేసిన పూనేం లింగన్న విప్లవోధ్యమాలకే ఆదర్శనీయుడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ అన్నారు. గురువారం సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు, సాయుధ దళపతి కామ్రేడ్ పూనేం లింగన్న 6వ, వర్ధంతిని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా పూనేం లింగన్న చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసి ముద్దుబిడ్డగా పుట్టి సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా రాజకీయాలకు ఆకృషితులై పనిచేసిన కామ్రేడ్ లింగన్న నిత్యం పేదల కోసమే ఆలోచించేవారన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి అటవీ గ్రామాల్లో , గిరిజన గుండెల్లో,ప్రజల్లో మమేకమై జీవితాంతం కృషిచేసిన విప్లవ మణిరత్నం అన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం రహస్య జీవితం గడపడానికి సిద్ధమై సాయుదంగా ధళ నాయకునిగా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో నరాంతక టిఆర్ఎస్ ప్రభుత్వం దొంగ చాటున బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారన్నారు. కామ్రేడ్ పూనేం. లింగన్న మరణం తెలిసిన ప్రజలు పోలీస్ లనే ఎదిరించి పూనేం లింగన్న పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రజల్లో అంత మమకారాన్ని పెంచుకున్న కామ్రేడ్ పూనేం లింగన్నను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవోధ్యమాలను నిర్మించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర, జిల్లా నాయకులు బి. కిశోర్, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఎం. లింబాద్రి, ఎం. నారాగౌడ్, ఇ. రమేష్, ఎస్. కిశోర్, జి. బాల్ రెడ్డి, జి. కిరణ్, వి. భూమాగౌడ్, ఎం.మోహన్, జి. ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.
