. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడమే దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి ప్రధాన కారణమని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత పేర్కొన్నారు. పంజాబ్లోని శ్రీ గంగానగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఐద్వా బెజ్గం సుజాత మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్లోని శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలికపై జరిగిన ఈ ఘటన దేశాన్ని కలచివేసిందని, బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులందరినీ చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో హోటల్ యజమానులు, ఆటో డ్రైవర్తో పాటు సంబంధిత నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, బాలికల భద్రత కోసం కఠిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఐద్వా కోరింది. అలాగే, బాధిత బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ప్రత్యేక రక్షణ, భరోసా కల్పించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, లక్ష్మి, అంజమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

