జగిత్యాల, బతుకమ్మ :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 20 రోజులుగా జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రులు, పీసీసీ చీఫ్ స్వయంగా మాట్లాడిన జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పార్టీకి రాజీనామా చేస్తే అందుకు గల కారణాలు తెలుపుతూ బుధవారం ఎఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ కార్గె, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు లేఖ రాశారు. నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న తనను కాంగ్రెస్ పార్టీ 20 నెలలుగా ఎలా అవమానించిందో సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి చేర్చుకున్న తర్వాత తనకు అడుగడుగునా అవమానాలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా సంజయ్ కే ప్రాధాన్యతను ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లోనూ అవమానానికి గురి చేశారని పేర్కొన్నారు. 20 నెలలుగా తాను అనుభవించిన మానసిక క్షోభను కాంగ్రెస్ పార్టీకి తెలిపినప్పటికీ మానసిక క్షోభను అనుభవించలేకనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. నాలుగు దశాబ్ధాల కాలంలో పార్టీ పరంగా వివిధ హోదాలను కల్పించిన గుర్తింపునకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

. . . జీవన్ రెడ్డి దారెటు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని జరిగిన ప్రచారానికి ఆయన రాజీనామాతో చెక్ పడింది. వారం రోజుల వ్యవధిలో మంత్రులు, పీసీసీ చీఫ్ బుజ్జగించిన జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గతంలోనే ప్రకటించినట్లు బుధవారం నియోజకవర్గ కేంద్రంలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి తనకు జరిగిన మానసిక క్షోభను వారికి వినిపించే ప్రయత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారా లేక బీజేపీలో చేరుతారనేది స్పష్టత రాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో జీవన్ రెడ్డి చర్చలు జరిపిన ఆయన తన నిర్ణయం మాత్రం ప్రకటించలేదు.
